Health Policy: భారత్ లో ఇక ఏ వయసు వారైనా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు!

  • ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలుకు వయో పరిమితి ఎత్తివేత
  • నోటిఫికేషన్ జారీ చేసిన ఐఆర్ డీఏఐ
  • గతంలో 65 ఏళ్ల వయసు వరకే హెల్త్ పాలసీ కొనుగోలుకు అవకాశం
  • ఇప్పుడా నిబంధన ఎత్తివేత
IRDAI lifts age restriction for health insurance policy purchaser

భారత్ లో ఇక ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకు భారత్ లో 65 ఏళ్ల వయసు వరకు మాత్రమే హెల్త్ పాలసీలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడా నిబంధనను ఎత్తివేశారు. 

65 ఏళ్లకు పైబడిన వృద్ధులు సైతం ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్ డీఏఐ) ప్రకటన చేసింది. ఇది 2024 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుందని ఐఆర్ డీఏఐ వెల్లడించింది. అన్ని వయసుల వారికి ఆరోగ్య భద్రత కల్పించడమే తమ ఉద్దేశం అని స్పష్టం చేసింది. 

తమ తాజా నిర్ణయం ద్వారా... ఇకపై బీమా కంపెనీలు వృద్ధులు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఇలా వివిధ వర్గాల వారికి ప్రత్యేకంగా బీమా పాలసీలు రూపొందించే అవకాశం ఉంటుందని ఐఆర్ డీఏఐ వివరించింది. 

అంతేకాదు, బీమా విధానంలో ఇటీవల తెచ్చిన మార్పులతో ఇక మీదట బీమా కంపెనీలు క్యాన్సర్, గుండె, మూత్ర పిండాల వైఫల్యం, ఎయిడ్స్ వంటి ప్రమాదకర జబ్బులతో బాధపడేవారికి బీమా పాలసీలు నిరాకరించడం కుదరదు. ఇంతకుమునుపే వున్న కొన్ని వ్యాధుల విషయంలో హెల్త్ ఇన్సూరెన్స్ వెయిటింగ్ పీరియడ్ ను 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గిస్తున్నట్టు ఐఆర్ డీఏఐ తన నోటిఫికేషన్ లో పేర్కొంది. అంతేకాదు, పాలసీ సమయంలో ఆ వ్యాధులను పాలసీదారు వెల్లడించినా, వెల్లడించకపోయినా 36 నెలల తర్వాత ఆయా క్లెయిమ్లను తిరస్కరించడానికి ఇకపై వీల్లేదు. 

ముఖ్యంగా, పాలసీదారులు ఆసుపత్రిలో చేరినప్పుడు వారికి ఆసుపత్రి ఖర్చులను భర్తీ చేసేందుకు బీమా సంస్థలు నష్టపరిహారం విధానం అవలంబిస్తుంటాయి. అయితే ఈ నష్టపరిహారం విధానంపై కేంద్రం నిషేధం విధించింది. ఇకమీదట బీమా కంపెనీలు తమ కవరేజిలో ఉన్న వ్యాధితో బాధపడే వ్యక్తికి స్థిరమైన ఖర్చులను అందించాల్సి ఉంటుంది. ప్రయోజన ఆధారిత పాలసీలను మాత్రమే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.

More Telugu News